పనాజీ: గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ బీజేపీని గురువారం హెచ్చరించారు. వచ్చే ఏడాది జరుగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ స్థానంలో పోటీ చేసేందుకు తనకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే కఠిన నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తన తండ్రి అయిన దివంగత మనోహర్ పారికర్ ఈ స్థానానికి 25 ఏండ్ల పాటు ప్రాతినిథ్యం వహించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ‘నేను పనాజీ (పంజిమ్) నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. నేను ఇప్పటికే దీని గురించి పార్టీకి చెప్పాను. పార్టీ టిక్కెట్ ఇస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని మీడియాతో అన్నారు.
బీజేపీ ఒకవేళ టిక్కెట్ నిరాకరించిన పక్షంలో ఏమి చేయాలనుకుంటున్నారు? అని ఉత్పల్ను మీడియా ప్రశ్నించింది. అయితే దాని గురించి మాట్లాడే సమయం ఇది కాదని ఆయన అన్నారు. ‘దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనోహర్ పారికర్ తన జీవితంలో ఏదీ తేలికగా పొందలేదు. అదేవిధంగా, నేను కూడా నాకు కావలసిన దాని కోసం పని చేయాలి. నేను కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఈ నిర్ణయాలు తీసుకోవడానికి నాకు అవసరమైన బలం కోసం ప్రార్థిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.
ఒకవేళ ఆ అవసరం వస్తే బీజేపీలో ఉంటూనే పోరాటం చేస్తానని ఉత్పల్ పారికర్ తెలిపారు. ‘నిర్ణయం తీసుకునే సమయం వచ్చినప్పుడు, నేను ప్రజల మాట వింటాను. నేను పార్టీకి చెప్పాను. పార్టీ నాకు (టిక్కెట్) ఇస్తుంది. నేను నమ్మకంగా ఉన్నాను’ అని స్పష్టం చేశారు.