బెంగళూరు, మార్చి 30: బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రం మరో మతపరమైన వివాదానికి వేదికైంది. ‘హలాల్ మాంసం ఆరోగ్యానికి హానికరం’ అంటూ రాష్ట్రంలోని రైట్ వింగ్ కార్యకర్తలు పోస్టర్లు అంటించారు. ‘హలాల్ ఆర్థికపరమైన మతయుద్ధం(ఎకనామిక్ జిహాద్)’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చిక్మగళూరు ఎమ్మెల్యే సీటీ రవి అభివర్ణించారు. హలాల్ మాంసాన్ని కొనవద్దని ప్రజలను కోరారు. బదులుగా హిందువుల దుకాణాల్లో కొనుగోలు చేయాలని సూచించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే హలాల్ మాంసం అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
‘వాళ్లు హిందువుల షాపుల్లో మాంసం కొననప్పుడు.. హిందువులు మాత్రం హలాల్ మాంసాన్ని ఎందుకు కొనాలి’ అని ప్రశ్నించారు. హలాల్పై పోస్టర్లను కాంగ్రెస్ ఖండించింది. ప్రజల మధ్య బీజేపీ విభజన తెస్తున్నదని ఆరోపించింది. ‘ముస్లింలు ఎమ్యెల్యేలు అయితే చట్టసభల ద్వారా జిహాద్ అంటారా.. ముస్లింలు స్కూలుకు పోతే విద్యా జిహాద్ అంటారా.. ’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ప్రశ్నించారు. కాగా, పోస్టర్లు అంటించినవారిపై చర్యలు తీసుకొంటామని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. విద్యాసంస్థల్లో హిజాబ్పై నిషేధం అంశంపై కొన్ని రోజుల పాటు రాష్ట్రమంతా అట్టుడికిన సంగతి తెలిసిందే.