ICMR : దేశంలోని పలు రాష్ట్రాల్లో హెచ్1ఎన్1 (H1N1) రకం వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ‘భారత వైద్య పరిశోధనా మండలి (ICMR)’ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది కొత్త వైరస్ కాదని తెలిపింది. 2009లో మహమ్మారికి కారణమైన అదే ఇన్ఫ్లుయెంజా-ఏ (హెచ్1ఎన్1) పీడీఎం09 వైరస్ ఇప్పుడు ఫ్లూగా కొనసాగుతోందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ (Dr.Rajiv Bahal) వెల్లడించారు.
ప్రతి సీజన్లో వైరస్లో చిన్నపాటి జన్యు మార్పులు సహజంగానే జరుగుతాయని చెప్పారు. దానివల్ల కొత్తగా మరింత ప్రమాదకరమైన వైరస్ పుట్టినట్లుగా భావించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ భాగం స్వల్ప లక్షణాలతోనే తగ్గిపోతున్నాయని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. హెచ్1ఎన్1పై ఐసీఎంఆర్ నిరంతరం నిఘా కొనసాగిస్తోంది.
దేశవ్యాప్తంగా 73 ప్రత్యేక ఆసుపత్రులతో కూడిన సెంటినెల్ నిఘా వ్యవస్థ ద్వారా ప్రతివారం శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నమూనాలను పరీక్షిస్తున్నారు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో వచ్చే రోగులు, ఫ్లూ లక్షణాలతో వచ్చే వారి నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. మరో 167 వైరస్ పరిశోధన, నిర్ధారణ ప్రయోగశాలలు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. హెచ్1ఎన్1తోపాటు హెచ్3ఎన్2, ఇన్ఫ్లుయెంజా-బి, కొవిడ్-19, హెచ్ఎంపీవీ, అడెనోవైరస్ వంటి ఇతర వైరస్లను కూడా పరీక్షల్లో గుర్తిస్తున్నారు.
ప్రస్తుతం హెచ్3ఎన్2 కేసులు 2-3 శాతం వరకు ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వీరిలో ఫ్లూ తీవ్రంగా మారి న్యుమోనియా వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి వైద్యుల సూచనతో సీజనల్ ఫ్లూ టీకా తీసుకోవచ్చని ఐసీఎంఆర్ తెలిపింది. హెచ్1ఎన్1 వైరస్వల్ల వచ్చే ఇన్ఫెక్షన్కు యాంటీబయాటిక్స్ పనిచేయవు.
అవసరమైన సందర్భాల్లో వైద్యుల పర్యవేక్షణలో యాంటీవైరల్ మందులు వాడాలి. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం, దగ్గేటప్పుడు నోరు మూసుకోవడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించింది.