గువాహతి: పెళ్లైన కొన్ని నెలలకే ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపాడు. ఆమె చేతి వేళ్లు సగానికి నరికాడు. తెగిన తలను ఫ్రిజ్లో దాచి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. (Man Kills Wife) అస్సాం రాజధాని గువాహతిలో ఈ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లైన జంట ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. గత రెండు రోజులుగా పొరుగువారికి వారు కనిపించలేదు. ఆ దంపతుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి.
కాగా, సెప్టెంబర్ 6న ఆ అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడాన్ని పొరుగువారు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. అపార్ట్మెంట్ లాక్ బ్రేక్ చేసి లోపలకు వెళ్లి చూశారు. మహిళ మృతదేహం ఛిద్రమైన స్థితిలో కనిపించడంతో షాక్ అయ్యారు. ఆమె చేతి వేళ్లు సగం వరకు నరికి ఉన్నాయి. మృతదేహం కుళ్ళిపోవడం మొదలైంది. తొలుత ఆ మహిళ తల కనిపించలేదు. పోలీసులు ఇంట్లో సోదా చేయగా రిఫ్రిజిరేటర్లో దాచిన ఒక పాలిథిన్ బ్యాగ్లో ఆమె తల లభించింది.
మరోవైపు హతురాలిని 25 ఏళ్ల రియా తాలుక్దార్గా పోలీసులు గుర్తించారు. తెగిన తలతో సహా ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఆ మహిళ భర్త ఆచూకీ ఎక్కడా లభించలేదు. శుక్రవారం అతడ్ని చివరిసారి చూసినట్లు పొరుగువారు తెలిపారు.
అయితే ఆదివారం రాత్రి రియా భర్త పోలీసులకు లొంగిపోయాడు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు గానీ, నిందితుడు లొంగిపోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి గానీ పోలీసులు ఇంకా వెల్లడించలేదు.