న్యూఢిల్లీ: గుట్కా యాడ్స్ చేసిన ముగ్గురు బాలీవుడ్ అగ్ర హీరోలకు షోకాజ్ నోటీసులిచ్చామని కేంద్రం తెలిపింది. అగ్ర నటులు హానికర ఉత్పత్తుల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్పై ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్లో విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. షోకాజ్ నోటీసులు అందుకున్న ముగ్గురు అగ్ర హీరోల్లో షారుక్ ఖాన్ (ShahRukh Khan), అక్షయ్ కుమార్ (Akshay Kumar), అజయ్ దేవ్గణ్ (Ajay Devgn) ఉన్నారని కేంద్రం తెలియజేసింది.
అగ్ర నటులు హానికారక ఉత్పత్తులకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంపట్ల అభ్యంతరం వ్యక్తంచేస్తూ మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి గౌరవ పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి ప్రకటనల్లో పాల్గొనడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. పిటిషనర్ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే కేంద్రాన్ని ఆదేశించింది.
అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదంటూ ఇటీవల పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దాంతో స్పందన కోరుతూ కోర్టు కేంద్రానికి నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే కోర్టుకు సమాచారం అందించారు. షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గణ్లకు అక్టోబర్ 22న షోకాజ్ నోటీసులు జారీ చేశామని చెప్పారు.
అదేవిధంగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇప్పటికే ఈ తరహా ప్రకటనల నుంచి తప్పుకున్నారని న్యాయస్థానానికి ఎస్బీ పాండే తెలియజేశారు. అయినప్పటికీ ఓ గుట్కా కంపెనీ ఆయన ప్రకటనలను ప్రసారం చేసిందని, దాంతో అమితాబ్ సదరు కంపెనీకి లీగల్ నోటీసులు పంపారని చెప్పారు. అంతేగాక ఈ వ్యవహారంపై ఓ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, కాబట్టి పిటిషన్ను కొట్టివేయాలని పాండే కోర్టును కోరారు. వాదనలు విన్న కోర్టు పిటిషన్పై తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.