జైపూర్: మంత్రి కుమారుడి వివాహ వేడుకలో కొందరు బహిరంగంగా తుపాకులు ప్రదర్శించడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపారు. రాజస్థాన్లోని బాన్స్వారాలో ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్ర మంత్రి మహేంద్రజిత్ సింగ్ మాలవీయ కుమారుడు చంద్రవీర్ సింగ్ పెండ్లి, బీజేపీ నేత, మాజీ మంత్రి ధన్ సింగ్ రావత్ కుమార్తెతో వైభవంగా జరిగింది. అనంతరం సోమవారం రాత్రి బాన్స్వారాలో పెండ్లి రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు మంత్రులు, రాజకీయ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. కాగా, ఈ సందర్భంగా సుమారు 40 మంది వ్యక్తులు బహిరంగంగా తుపాకులు ప్రదర్శించడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపారు.
రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రి కుమారుడు, బీజేపీకి చెందిన మాజీ మంత్రి కుమార్తె పెండ్లి కావడంతో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే బహిరంగంగా తుపాకులను గాల్లోకి కాల్చడంపై ఏ ఒక్క నేత లేదా అధికారి నోరు మెదపలేదు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.