న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ రూపొందించిన మొట్టమొదటి పెట్టుబడి స్నేహపూర్వక సూచీ(ఐఎఫ్ఐ)- 2026లో దేశంలోనే అత్యంత పెట్టుబడి-అనుకూల రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. ఒకరి ఉత్తమ విధానాల నుండి మరొకరు నేర్చుకుంటూనే ప్రైవేట్ పెట్టుబడుల కోసం పోటీపడేలా ఈ సూచీ ర్యాంకింగ్లు రాష్ర్టాలను ప్రోత్సహిస్తాయని నీతి ఆయోగ్ ఆశిస్తున్నది. శుక్రవారం విడుదలైన ఐఎఫ్ఐ నివేదిక పెట్టుబడులను ఆకర్షించి, వాటిని నిలబెట్టుకునే సామర్థ్యంపై 28 రాష్ర్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను అంచనా వేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేసేటపుడు 1,850 మందికి పైగా పెట్టుబడిదారులను సర్వే చేయడంతోపాటు 165 మంది వాటాదారుల నుండి వచ్చిన సూచనలను కూడా పొందుపరిచారు. ఈ నివేదిక రాష్ర్టాలను అగ్రశ్రేణి రాష్ర్టాలు, ముందంజలో ఉన్న రాష్ర్టాలు, వర్ధమాన రాష్ర్టాలు, ఆకాంక్ష గల రాష్ర్టాలుగా వర్గీకరించింది.