అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ పార్టీ బలంగా ఉన్నది..? ఓవరాల్గా ఏ పార్టీ గెలువబోతున్నది..? ఎక్కడ ఏ సామాజిక వర్గానికి గట్టి పట్టున్నది..? అనే అంశాలపై జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే ఖర్వా కమ్యూనిటీ అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నది.
ఖర్వా కమ్యూనిటీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనుంది. రాజకీయ పార్టీల అదృష్టాన్ని తిరగరాసే స్థితిలో అక్కడ ఖర్వా కమ్యూనిటీ ఉంది. గుజరాత్లోని మొత్తం ఓటర్లలో 9 శాతం మంది ఖర్వా కమ్యూనిటీకి చెందినవారే.
చేపల వేట ప్రధాన జీవనాధారంగా ఖర్వా కమ్యూనిటీకి చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. పోరుబందర్, మంగళూరు, జఫ్రాబాద్, వల్సాడ్, మాండ్వి, ద్వారక తదితర 12 నియోజకవర్గాల్లో ఖర్వా కమ్యూనిటీ బలంగా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది ఖర్వా కమ్యూటీయే.
అయితే, ఆ ఖర్వా కమ్యూనిటీకి ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య డీజిల్ ధర. ఆ సామాజిక వర్గం ఏడాదిలో చేసే మొత్తం ఖర్చుల్లో 70 శాతం డీజిల్ ఖర్చే. గుజరాత్ ప్రభుత్వం పెద్ద బోటుకు 24 వేల లీటర్లు, చిన్న బోటుకు 21 వేల లీటర్ల డీజిల్ సబ్సిడీగా ఇస్తున్నది. కానీ, ఇప్పుడు డీజిల్ వినియోగం బాగా పెరిగింది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు కొన్ని రోజుల ముందు ఓట్ల కోసం అక్కడి బీజేపీ సర్కారు సబ్సిడీ డీజిల్ పరిమితిని పెద్ద బోట్లపై 34 వేల లీటర్లకు, చిన్న బోట్లపై 30 వేల లీటర్లకు పెంచింది. గతంలో గుజరాత్ ఫిషరీస్ సెంట్రల్ కోఆపరేటివ్ అసోసియేషన్కు చెందిన పెట్రోల్ పంపుల నుంచి మాత్రమే సబ్సిడీ డీజిల్ పొందే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని పెట్రోల్ పంపుల నుంచి డీజిల్ను పొందే అవకాశం కల్పించింది.
అయినా, ఖర్వా కమ్యూనిటీ బీజేపీ వైపు మొగ్గే అవకాశాలు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా బీజేపీ పాలనలో తమకు ఆశించిన ప్రయోజనం దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారు.