పనాజీ: ఒక వ్యక్తికి విమానంలో మహిళ పరిచయమైంది (Woman Met On Flight). గోవా టూర్కు వెళ్లిన అతడు ఆ తర్వాత ఆమెను హోటల్కు పిలిచాడు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. గుజరాత్కు చెందిన 47 ఏండ్ల లక్ష్మణ్ షియార్, గోవా సందర్శన కోసం ఇటీవల విమానంలో ప్రయాణించాడు. ఈ సందర్భంగా అదే విమానంలో ప్రయాణించిన ఒక మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమె మొబైల్ నంబర్ తీసుకున్నాడు. ఆ మహిళతో టచ్లో ఉంటానని చెప్పాడు. విమానం దిగిన తర్వాత వారిద్దరూ విడివిడిగా గోవా టూర్కు వెళ్లారు.
కాగా, ఈ నెల 23న లక్ష్మణ్ ఆ మహిళకు ఫోన్ చేశాడు. తాను బస చేసిన అసోనోరా గ్రామంలోని హోటల్ చాలా బాగున్నదని చెప్పాడు. ఆ రిసార్ట్లో మంచి సౌకర్యాలు ఉన్నాయని తెలిపాడు. వీటిని చూసేందుకు అక్కడకు రమ్మని పిలిచాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళ ఆ హోటల్కు వెళ్లింది. ఆమెను తన రూమ్కు తీసుకెళ్లిన అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు.
మరోవైపు బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. లక్ష్మణ్ తనపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడి కోసం వెతికారు. చివరకు మపుసా టౌన్ సమీపంలోని థివిమ్ గ్రామంలో ఉన్న అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే బాధితురాలి వయసు ఎంత అన్నది పోలీసులు వెల్లడించలేదు.