అహ్మదాబాద్ : మహిళల హక్కులను సమర్ధిస్తూ గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్యను తనతో కలిసి జీవించాలని, కాపురం చేయాలని వ్యక్తి ఒత్తిడి చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. కలిసి జీవించేందుకు భార్య నిరాకరిస్తే కోర్టు ఉత్తర్వులున్నా భర్త ఆమెను ఒత్తిడి చేయరాదని పేర్కొంది. బనసకంత దంపతుల కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది.
2015లో దంపతులకు వివాహం కాగా వారికి ఓ కుమారుడు ఉన్నాడు. నర్సుగా పనిచేసే మహిళ భర్త ఇంటిని విడిచి తన తల్లితండ్రులతో కలిసి ఉంటోంది. దీంతో పలన్పూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన మహిళ భర్త ఆమెతో దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని కోరాడు. ఈ పిటిషన్పై స్పందించిన కోర్టు భర్తతో కలిసి జీవించాలని మహిళను ఆదేశించింది. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.
కలిసి జీవించాలని, దాంపత్య హక్కులను ఏర్పరచుకునేందుకు ఏ వ్యక్తి మహిళను లేదా భార్యను ఒత్తిడి చేయకూడదని, కలిసి జీవించేందుకు భార్య నిరాకరిస్తే కోర్టు ఉత్తర్వుల ద్వారా ఆమెపై ఒత్తిడి చేయలేరని జస్టిస్ జేబీ పర్దివాలా, నిరల్ మెహతాతో కూడిన హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.