న్యూఢిల్లీ, డిసెంబర్ 5: గుజరాత్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పలు చానళ్లు, సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించాయి. గుజరాత్లో మళ్లీ బీజేపీ పాగా వేస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఆ పార్టీకి 132 సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపాయి. కాంగ్రెస్కు 38, ఆప్కు 8 సీట్లు వచ్చే చాన్స్ ఉన్నట్టు వెల్లడించాయి. అటు.. హిమాచల్ప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదని విశ్లేషించాయి. అక్కడ మొత్తం 68 సీట్లకు గానూ, బీజేపీ, కాంగ్రెస్ 30-35 సీట్లు దక్కించుకొనే అవకాశాలున్నాయని వివరించాయి. అక్కడ ఆప్కు నిరాశ తప్పదని పేర్కొన్నాయి. ఇక.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో చీపురు (ఆప్) ఊడ్చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. 250 వార్డులకు గానూ ఆ పార్టీ ఏకంగా 150కి పైగా సీట్లు సాధిస్తుందని అంచనావేశాయి. అక్కడ బీజేపీ తన అధికారాన్ని కోల్పోతుందని, 84 సీట్లే దక్కించుకొంటుందని వెల్లడించాయి. ఇక కాంగ్రెస్ మూడోస్థానానికే పరిమితం అవుతుందని స్పష్టం చేశాయి.