అహ్మదాబాద్: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన భూపేంద్ర పటేల్ ( Oath taking ) రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ విషయం గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ మీడియాకు వెల్లడించారు. అయితే, రేపు భూపేంద్ర పటేల్ ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని, మంత్రుల ప్రమాణ స్వీకారాలు ఉండబోవని ఆయన స్పష్టంచేశారు.
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం తన పదవికి రాజీనామా చేయడంతో ఇవాళ బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై భూపేంద్ర పటేల్ను నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది. మాజీ సీఎం విజయ్ రూపానీ భూపేంద్ర పటేల్ పేరును ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. అనంతరం ఈ విషయాన్ని కేంద్ర పరిశీలకుడిగా వచ్చిన సెంట్రల్ మినిస్టర్ నరేంద్రసింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు.