అహ్మదాబాద్: సుమారు 16,000కు పైగా గుండె సర్జరీలు చేసి వేలాది మంది ప్రాణాలను కాపాడిన డాక్టర్ గుండెపోటుతో మరణించారు. అదీ కూడా 41 ఏళ్ల వయసులో ఆ కార్డియాలజిస్ట్ (Gujarat cardiologist) చనిపోవడం అందరినీ షాకింగ్కు గురి చేసింది. గుజరాత్లోని జామ్నగర్లో ఈ సంఘటన జరిగింది. కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ (Dr Gaurav Gandhi) ఆ నగరంలో ఎంతో పేరున్న డాక్టర్. ప్రముఖ గుండె వైద్య నిఫుణుడిగా ఖ్యాతి గాంచిన ఆయన 16,000కు పైగా గుండె శస్త్రచికిత్సలు చేశారు. రోజు మాదిరిగానే ఆసుపత్రిలో రోగులను చూసిన ఆయన సోమవారం రాత్రి ప్యాలెస్ రోడ్లోని తన నివాసానికి వెళ్లారు. భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు. అయితే మంగళవారం ఉదయానికి చనిపోయారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ అయ్యిది.
కాగా, కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ సోమవారం రాత్రి ఎలాంటి అసౌకర్యం లేదా ఇబ్బందికి గురికాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చాలా ఆరోగ్యంగా ఉన్న ఆయన ఆ రాత్రి వేళ ఎలాంటి అనారోగ్య సమస్యలను ప్రస్తావించలేదన్నారు. సాధారణంగా ఉదయం 6 గంటలకు నిద్ర లేచే గౌరవ్ ఆ సమయానికి మేల్కోలేదన్నారు. దీంతో నిద్ర నుంచి లేపేందుకు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ పిలుపునకు స్పందించకపోవడంతో అచేతనంగా ఉన్న ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే ఆయన అప్పటికే గుండెపొటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారని వెల్లడించారు.
మరోవైపు సుమారు 16 వేలకుపైగా గుండె ఆపరేషన్లు చేసి ఎందరో రోగుల ప్రాణాలను కాపాడిన కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ, 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోవడం గురించి తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులతోపాటు తోటి డాక్టర్లు షాక్ అయ్యారు. కాగా, ఆయన మరణం పట్ల ఎలాంటి అనుమానాలు తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు.