లక్నో: చోరీ కేసులో నిందితుడైన వరుడి పెళ్లి జరుగుతుండగా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Groom arrested for theft) ఈ గొందరగోళ పరిస్థితుల్లో వరుడి సోదరుడ్ని వధువు పెళ్లాడింది. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో జరిగింది. ఒక మద్యం షాపు, క్యాంటీన్ నుంచి 35 డబ్బాల్లో ఉన్న మద్యం సీసాలు, ఇతర వస్తువులు చోరీ అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. చోరీ జరిగిన సంఘటనా స్థలం నుంచి ఒక బైక్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా దొంగతనానికి పాల్పడిన నిందితుడ్ని ఫైజల్గా గుర్తించారు.
మరోవైపు సోమవారం ఒక యువతితో ఫైజల్ పెళ్లి జరుగుతుండగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పెళ్లి తంతు మధ్యలో ఉండగానే అతడ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. దీంతో ఫైజల్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
కాగా, చోరీ గురించి ఫైజల్ను పోలీసులు ప్రశ్నించగా నేరం చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. అయితే ఈ గొందరగోళ పరిస్థితుల్లో పెళ్లి వేదిక వద్ద వధువు ఒంటరిగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను పెళ్లి చేసుకునేందుకు వరుడి అన్నయ్య ముందుకు వచ్చాడు. ఇరు కుటుంబాలు దీనికి అంగీకరించడంతో చివరకు వారిద్దరికీ వివాహం జరిగింది.