(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): తల్లి కడుపులోని బిడ్డ లింగాన్ని నిర్ధారించడంలో పురుషుల శుక్రకణాల్లోని వై-క్రోమోజోమ్స్ కీలక పాత్ర పోషిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే, గడిచిన కొంతకాలంగా ఈ జన్యువుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నదని, రానున్న కాలంలో ఇవి కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదని జపాన్లోని హొక్కయిడో యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇదే జరిగితే, భవిష్యత్తులో పురుష జననాలు ఉండకపోవచ్చని పరిశోధకులు అంచనాకు వచ్చారు. అయితే, వైద్యశాస్త్రంలో అమల్లోకి వచ్చిన వినూత్న పద్ధతులు, ఆవిష్కరణల ద్వారా కొత్త జన్యువుల సృష్టితో ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం అంత పెద్ద కష్టమేమీ కాదని వాళ్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివరాలు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
అలా కనుమరుగు..
మనుషులు సహా క్షీరదాల వంటి పాలిచ్చే ఆడ జంతువుల్లో రెండు ‘ఎక్స్’ క్రోమోజోమ్స్ ఉంటాయి. మగవాటిలో ఒక ఎక్స్ క్రోమోజోమ్తో పాటు ఒక వై క్రోమోజోమ్ కూడా ఉంటుంది. ఇదే గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారిస్తుంది. అయితే, పురుషుల్లోని ఎక్స్ క్రోమోజోమ్లో 900 వరకూ వివిధ రకాల జన్యువులు ఉండగా, ‘వై’ క్రోమోజోమ్లో మాత్రం వాటి సంఖ్య 900 నుంచి 55కు పడిపోయినట్టు పరిశోధకులు గుర్తించారు. గడిచిన 166 మిలియన్ సంవత్సరాల్లో ఈ మేరకు జన్యువుల క్షీణత జరిగినట్టు తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న 11 మిలియన్ ఏండ్లలో ‘వై’ క్రోమోజోమ్లోని మిగిలిన 55 జన్యువులు (ఎస్ఆర్వై జన్యువులు) కనిపించకుండాపోవచ్చని అంచనా వేశారు. ఇదే జరిగితే, గర్భంలోని ప్రతీశిశువు ఆడ శిశువుగానే పుట్టొచ్చని అభిప్రాయపడ్డారు.
అలా జరుగొచ్చు కూడా..
తూర్పు ఐరోపాలో కనిపించే మోల్ వోల్స్ అనే ఎలుక జాతికి చెందిన మగ జంతువులు, జపాన్లో కనిపించే మగ స్పైన్ ర్యాట్స్లో ఇప్పటికే ‘వై’ క్రోమోజోమ్స్ అంతరించిపోయాయని పరిశోధకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినప్పటికీ, ‘వై’ క్రోమోజోమ్లోని జన్యువుల లక్షణాలు కలిగిన మరికొన్ని కొత్త జన్యువులు (ప్యూ జీన్స్) ఆయా మగ జీవుల్లో కొత్తగా పుట్టుకురావడంతో వాటి జాతి పరిణామక్రమం అంతరించిపోలేదని, కొత్తగా మగ పిల్లలు కూడా పుడుతున్నట్టు పరిశోధకులు తెలిపారు. మనుషుల్లోనూ అలాంటి పరిస్థితులు జరుగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.