న్యూఢిల్లీ : ఓటీటీ సినిమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు మాత్రమే సెన్సార్ సర్టిఫికెట్ ఉన్నది. ఇక నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకు కూడా సెన్సార్ తప్పనిసరి చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నది. ఇప్పటి దాకా ఓటీటీ సినిమాలు 2021 సమాచార సాంకేతిక హక్కు నిబంధనల ప్రకారం రిలీజ్ అవుతున్నాయి. దీంతో సెన్సార్ బోర్డు థియేటర్ సినిమాల్లో అభ్యంతరం చెప్పిన సీన్లు, కట్స్ను అలాగే ఉంచి కొన్ని సార్లు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.
సత్లుజ్ వివాదం కారణంగా..ఇటీవల దిల్జిత్ దొసాంజ్ నటించిన సత్లుజ్ సినిమా పెద్ద వివాదం అయింది. మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ కల్రా జీవిత కథ ఆధారంగా మూవీ తీశారు. సెన్సార్ బోర్డు అనేక కట్స్ చెప్పగా.. దాన్ని నేరుగా జీ5 ఓటీటీలో జూలై 3న రిలీజ్ చేశారు. కానీ కొన్ని కారణాలతో ఈ మూవీని రెండు రోజుల్లోనే డిలీట్ చేయించారు. సత్లుజ్ వివాదం నేపథ్యంలో ఓటీటీ సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలనే నిబంధనను కేంద్రం తీసుకొచ్చే యోచనలో ఉన్నది.