న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నాలుగో కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ను గుర్తించారు. దీంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. మంకీపాక్స్పై ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఆధ్వర్యంలో ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కాగా, ఢిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. 31 ఏండ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకింది. బాధితుడు జ్వరం, చర్మంపై దద్దుర్లతో ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం లోక్ నాయక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఎలాంటి విదేశీ ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు తెలిపారు. అయితే ఇటీవల హిమాచల్ప్రదేశ్లోని మనాలీలో జరిగిన ఒక స్టేజ్ పార్టీకి హాజరయ్యాడని చెప్పారు.
మరోవైపు కేరళలో ఇప్పటికే మూడు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 14న తొలి మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దుబాయ్ నుంచి కన్నూర్కు వచ్చిన 31 ఏండ్ల వ్యక్తికి ఈ నెల 18న మంకీపాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అలాగే ఈ నెల 22న కేరళలో మూడో కేసు బయటపడింది. అనేక దేశాల్లో వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తున్న మంకీపాక్స్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) శనివారం ప్రకటించింది.