న్యూఢిల్లీ: మార్కెట్లో చక్కెర అక్రమ నిల్వలను అరికట్టేందుకు, పెరుగుతున్న రిటైల్ ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర డీలర్ల నిల్వ పరిమితిని సగానికి తగ్గిస్తూ నిబంధనలను కఠినతరం చేసింది. సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు డీలర్ల స్టాక్ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుంచి 2,000 క్వింటాళ్లకు తగ్గించినట్లు కేంద్ర ఆహారశాఖ తెలిపింది. అయితే కోల్కతా, దాని మెట్రో పాలిటన్ ప్రాంత మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అక్కడ మాత్రం పాత 4,000 క్వింటాళ్ల పరిమితిని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. నూతన నిబంధనల ప్రకారం స్టాక్ అందిన తేదీ నుంచి 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోకూడదు. దేశీయ మార్కెట్లో చక్కెర కొరత లేకుండా చూడటం, స్పెక్యులేషన్ ట్రేడింగ్, అక్రమ నిల్వలను నిరోధించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.