కోల్కతా, మే 7: ఆరునూరైనా తన పదవికి రాజీనామా చేసేది లేదంటూ ఎన్నికల్లో ఓటమి పాలైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భీష్మించిన క్రమంలో రాష్ట్ర శాసనసభను బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం రద్దు చేశారు. దీని అర్థం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఇకపై ముఖ్యమంత్రి కాదు. ఈ ఎన్నికల్లో ఆమె ఎక్కడా విజయం సాధించ లేదు కాబట్టి కనీసం ఆమె ఎమ్మెల్యే కూడా కాదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 172లోని 2వ క్లాజ్ ప్రకారం శాసనసభ రద్దును మే 7వ తేదీ నుంచి అమలు చేసినట్టు గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు.
‘2026, మే 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా, నేను పశ్చిమ బెంగాల్ శాసనసభను రద్దు చేస్తున్నాను’ అని ఆర్ఎస్ రవి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల లూటీ ద్వారా బీజేపీ ఈ ఎన్నికల్లో అక్రమంగా, అనైతికంగా గెలిచిందని, తనకు న్యాయం జరిగే వరకు పదవి నుంచి దిగనంటూ మమతా బెనర్జీ భీష్మించుకుని కూర్చోవడంతో గవర్నర్కు ఈ చర్య అనివార్యమైంది.