రాయ్పూర్, జనవరి 3: ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ రాజ్యాంగ పరిధిని దాటుతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఆరోపించారు. రిజర్వేషన్ల సవరణపై చేసిన రెండు బిల్లులపై ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నలు అడగటాన్ని ఆయన తప్పుపట్టారు. బిల్లులను ఆమోదించాలి లేదా తిరస్కరించాలి, కానీ ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ నిర్వహించిన జన్ అధికార్ మహా ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం స్పష్టమైన బాధ్యతలు, పరిధిని నిర్ణయించిందని, గవర్నర్ ఈ పరిధిని దాటుతున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ చేసిన బిల్లును గవర్నర్ ఆమోదించాలి లేదంటే తిరస్కరించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 స్పష్టం చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. రాజ్భవన్ను బీజేపీ రాజకీయ క్షేత్రం చేసిందని, రిజర్వేషన్ల ఫలితాలను ఆ పార్టీ అడ్డుకుంటున్నదని ఆయన ఆరోపించారు.