న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై దేశంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మిజోరాం, జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో రోజువారీ కరోనా కేసులు, మరణాల రేటు వేగంగా పెరుగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 మధ్య గత వారం కంటే కరోనా కేసుల నమోదు 727 శాతం పెరిగింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కూడా కరోనా కేసులు 152 శాతం పెరిగాయి. తమిళనాడులోని మూడు జిల్లాల్లో కొత్త కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నది. మిజోరాంలోని సైహా (237 శాతం) సహా నాలుగు జిల్లాలు, ఒడిశాలోని , దెంకనల్ (667 శాతం) ఆరు జిల్లాల్లో కరోనా లోడ్ భారీగా పెరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది.
మరోవైపు కేరళలో కరోనా మరణాలు పెరుగడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 19- 25 మధ్య త్రిస్సూర్ జిల్లాలో 12 మరణాలు నమోదు కాగా తర్వాత వారంలో ఈ సంఖ్య 128కి పెరిగింది. అదే సమయంలో మలప్పురం జిల్లాలో 70 మరణాలు నమోదు కాగా తర్వాత వారంలో 109కి పెరిగినట్లు పేర్కొంది.
కాగా, డిసెంబర్ 3తో ముగిసిన నెలలో కేరళలో మొత్తం 1,71,521 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం కేసుల్లో 55 శాతానికి పైగా ఇక్కడే నమోదయ్యాయి. నవంబర్ 26తో ముగిసే వారానికి కేరళలో మరణాల సంఖ్య 1,890 ఉండగా డిసెంబర్ 3తో ముగిసిన వారానికి ఈ సంఖ్య 2,118కి పెరిగినట్లు కేంద్రం గుర్తించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆయా రాష్ట్రాలకు శనివారం లేఖలు రాశారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే ప్రమాదంపై అప్రమత్తం చేశారు. ‘రిస్క్’ దేశాలతో పాటు విదేశాల నుంచి వచ్చేవారిపై నిఘా పెంచాలని సూచించారు. హాట్స్పాట్లను పర్యవేక్షించాలని, కోవిడ్ రోగుల నమూనాలను జన్యు శ్రేణి కోసం పంపాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను పెంచాలని కోరారు.