సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ, జూన్ 30: శాసన వ్యవస్థ లేదా కార్యనిర్వాహక వ్యవస్థ ప్రత్యక్షంగాగానీ పరోక్షంగాగానీ న్యాయవ్యవస్థను నియంత్రించరాదని, అలా చేస్తే చట్టబద్ధ పాలన మిథ్యగా మిగిలిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. సోషల్ మీడియా పట్ల న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలని, వాటి ప్రభావానికి లోనుకాకూడదని హెచ్చరించారు. సీజేఐ బుధవారం జస్టిస్ పీడీ దేశాయ్ స్మారక సందేశంలో భాగంగా ప్రసంగించారు. కేసులపై నిర్ణయంలో మీడియా ట్రయల్స్ ప్రభావం పడకుండా చూసుకోవాలని న్యాయమూర్తులకు సూచించారు. ప్రజల భావోద్వేగాలకు, సోషల్ మీడియా ప్రచారాలకు ప్రభావితం కాకూడదని చెప్పారు. బయటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమన్నారు.
జస్టిస్ భూషణ్ సేవలు మరువలేనివి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ తీర్పులు ఆయన సంక్షేమ, మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తాయని జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. జస్టిస్ భూషణ్ తమకు విలువైన సహచరుడని, న్యాయ వ్యవస్థకు ఆయన అందించిన సేవలు చిరకాలం గుర్తుంటాయని అన్నారు. జస్టిస్ భూషణ్ జూలై 4న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో బుధవారం వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం గురించి జస్టిస్ భూషణ్కు ఉన్న తపన ఆయన అభిప్రాయాల్లో ప్రతిబింబిస్తుందని చెప్పారు.