పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలెక్సో రెజినాల్డో లౌరెన్కొ సోమవారం అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 40 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం రెండుకు తగ్గింది. తాజాగా రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు సైతం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పది మందితో తొలిజాబితా విడుదల చేయగా.. ఇందులో లౌరెన్కొ పేరును సైతం చేర్చింది. దక్షిణ గోవా జిల్లాలోని కర్టోరిమ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన సోమవారం మధ్యాహ్న స్పీకర్ కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని సమర్పించారు. లౌరొంకో త్వరలోనే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నెల ప్రారంభంలో మాజీ సీఎం రవినాయక్ సైతం కాంగ్రెస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
అంతకు ముందు మాజీ సీఎం లుజిన్హో ఫలేరో సైతం కాంగ్రెస్ను వీడి టీఎంసీ తీర్థం స్వీకరించారు. 2017లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, 13 సీట్లు సాధించిన బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పలు ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి గోవా అసెంబ్లీలో ఇద్దరు శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు.