హైదరాబాద్: ఈ రోజు ట్విటర్లో ‘గో బ్యాక్ మోదీ’ హ్యాష్ట్యాగ్ టాప్ ట్రెండింగ్లో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ద్వి దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఇదేరోజు సాయంత్రం తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. కాగా, విభజన హామీలు అమలుచేయకుండా తెలంగాణకు ఎలా వస్తారంటూ ఇటు తెలంగాణ నెటిజన్లు, మోదీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారంటూ అటు తమిళనాడు ప్రజలు మండిపడుతున్నారు. ట్విటర్లో ‘గ్యో బ్యాక్ మోదీ’ అనే హాష్ట్యాగ్తో నిరసన తెలుపుతున్నారు.
‘గో బ్యాక్ మోదీ’ అనే హాష్ట్యాగ్ గురువారం ట్విటర్లో టాప్ ట్రెండింగ్లో ఉంది. ఈ హాష్ట్యాగ్తో ఇప్పటివరకూ 3లక్షల 18వేల మంది ట్వీట్లు చేశారు. ఉత్తరాదికి నిధులిస్తూ దక్షిణాది రాష్ట్రాలపై మోదీ వివక్ష చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై నరేంద్ర మోదీకి తెలంగాణ నెటిజన్లు 17 ప్రశ్నలు సంధించారు. తమ రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేస్తూ ఇక్కడి ఎలా వస్తారని ప్రశ్నించారు. గో బ్యాక్ మోదీ అంటూ విరుచుకుపడ్డారు.