న్యూఢిల్లీ: 2022 నుంచి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల సగటు ఆయుర్దాయంలో పెరుగుదల కనిపించనుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ప్రపంచ అధ్యయనం పేర్కొంది. ఇది పురుషుల్లో 5 ఏండ్లు, మహిళల్లో 4 ఏండ్లుగా ఉండనుంది. ప్రస్తుతం ఆయుర్దాయం తక్కువగా ఉన్న దేశాల్లో ఈ మెరుగుదల కనిపించనుందని.. దాని ఫలితం ప్రపంచ సగటును ప్రభావితం చేస్తుందని తెలిపింది.
గుండె జబ్బులు, కొవిడ్-19, మాతృత్వ మరణాలు, శిశు మరణాలు, పోషకాహార వ్యాధులు, అంటు వ్యాధుల నిరోధంలో ప్రజారోగ్య రక్షణ చర్యలు మెరుగవడం వల్ల ప్రజల ఆయుర్దాయం పెరగనుందని అధ్యయనం విశ్లేషించింది. ప్రపంచ వ్యాప్తంగా సగటు జీవిత కాలంలో అసమానతలు తగ్గడం కూడా ఆయుర్దాయం పెరగడానికి ఒక కారణమని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ క్రిస్ ముర్రే తెలిపారు.