బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన ఆ రాష్ట్ర మాజీ సీఎం, రాజకీయ కురువృద్ధుడు జగదీష్ శెట్టర్ (Jagadish Shettar) పరాభవాన్ని చవిచూశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. లింగాయత్ నేతల్లో అత్యంత ప్రముఖుడైన జగదీష్ శెట్టర్, బీజేపీని వీడి ఆ పార్టీ కొంప ముంచినప్పటికీ తన కొంపను (స్థానాన్ని) నిలబెట్టుకోలేకపోయారు. కంచుకోట అయిన హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ను బీజేపీ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను నిర్మించిన బీజేపీ తన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిందని, పార్టీ నుంచి బలవంతంగా తనను వెళ్లగొట్టారని ఆ సందర్భంగా విమర్శించారు.
కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నష్టం కలిగించినప్పటికీ సొంత నియోజకవర్గం హుబ్లీ-ధార్వాడ సెంట్రల్లో బీజేపీ అభ్యర్థి మహేష్ తెంగినాకై చేతిలో జగదీష్ శెట్టర్ ఓడిపోయారు. అయితే ఆయనతోపాటు ఇతర బీజేపీ నేతల చేరికతో లబ్ధి పొందిన కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయం వైపు దూసుకెళ్లింది. కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన లక్ష్మణ్ సవాడి విజయం సాధించారు. అథని అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన, బీజేపీ అభ్యర్థి మహేష్ ఈరంగౌడ్ కుమతల్లిపై 76,122 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.
మరోవైపు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీని వీడి జేడీ(ఎస్)లో చేరిన ముదిగెరె ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి తన సీటును కోల్పోయారు. కాంగ్రెస్ అభ్యర్థి నాయనా మోటమ్మ ఆ స్థానంలో విజయం సాధించారు.