ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ (Ajit Pawar) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న భార్య సునేత్రా పవార్కు మద్దతుగా ఇందాపూర్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ ప్రసంగించారు. అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నామన్న ఆయన ఈవీఎం బటన్ను నొక్కాలని ఓటర్లను కోరారు. లేకపోతే చేతులు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని అంటూ నిధులు ఆపేస్తామని పరోక్షంగా హెచ్చరించారు.
కాగా, ఇందాపూర్లో డాక్టర్లతో సమావేశం సందర్భంగా కూడా అజిత్ పవార్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య అధికారులు తమను వేధిస్తున్నారన్న గైనకాలజిస్టుల ఫిర్యాదుపై ఆయన స్పందించారు. అయినప్పటికీ ఆసుపత్రుల్లో చట్టవిరుద్ధమైన పనులు జరుగుతాయని ఆరోపించారు. ‘కొన్ని జిల్లాల్లో స్త్రీ, పురుషుల నిష్పత్తి 850 మంది స్త్రీలకు 1000 మంది మగవాళ్లుగా తారుమారైంది. ఇలా అయితే భవిష్యత్తులో కష్టాలు తప్పవు. ద్రౌపది గురించి ఆలోచించే పరిస్థితి రావచ్చు’ అని అన్నారు. అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు.
మరోవైపు అజిత్ పవార్ ఓటర్లను బెదిరించడం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించడమేనని శరద్పవార్ ఎన్సీపీ వర్గం నేత మహేశ్ తపసే ఆరోపించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.