దేశంలోని ఇతర ఫార్మా కంపెనీలను టీకా
ఉత్పత్తిలో భాగస్వాములను చేయండి
అలాగైతేనే ప్రజలందరికీ వ్యాక్సిన్ సాధ్యం
లేదంటే.. రెండేండ్లు పడుతుంది
పధాని మోదీకి కేజ్రీవాల్ సూచన
న్యూఢిల్లీ, మే 11: దేశంలో కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ నుంచి టీకా ఫార్ములాలను సేకరించి.. దేశంలోని ఇతర ఫార్మా కంపెనీలకు అందించాలని, తద్వారా టీకాల ఉత్పత్తిని పెంచాలని ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక బహిరంగలేఖ రాశారు. ‘ప్రస్తుతం సీరం, భారత్ బయోటెక్ నెలకు 6-7 కోట్ల కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ లెక్కన దేశంలోని ప్రజలందరికీ టీకాలు వేయాలంటే రెండేండ్లు పడుతుంది. ఈలోపు ఎన్ని కరోనా వేవ్లు వస్తాయో.. ఎంత నష్టం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈ విపత్తును నివారించాలంటే.. ఆ రెండు కంపెనీల తాలూకు టీకా ఫార్ములాలను దేశంలో సురక్షితంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే ఇతర కంపెనీలకు కూడా కేంద్రం తెలియజేయాలి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని కోరారు.