న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో పేరుకుపోయిన అవినీతిని కడిగేసేందుకు తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ అక్కడి ఓటర్లను కోరారు. వచ్చే ఆదివారం (డిసెంబర్ 4) ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కేజ్రివాల్ ఇవాళ నగరంలో వ్యాపారులతో సమావేశమయ్యారు.
ఢిల్లీలో అధికారం తమది ఉంటే, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ చేతిలో ఉన్నదని, దాంతో ఢిల్లీలో వాయు, నీటి కాలుష్య నివారణకు ఏమీ చేయలేకపోతున్నామని కేజ్రివాల్ చెప్పారు. గతంలో కూడా ఎప్పుడూ ఢిల్లీ పీఠం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఒకే పార్టీ చేతిలో లేవని, ఈ సారి ఆ సంప్రదాయాన్ని తిరగరాయాలని, మున్సిపల్ కార్పొరేషన్లో తమను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొన్నది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. ఈ నెల 4న ఎంసీడీ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ) ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఈ నెల 7న ఓట్లను లెక్కించనున్నారు.