సమాజంలో చీలికలు తీసుకురావడానికి అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని, కాంగ్రెస్ కూడా ఇందుకు మినహాయింపు కాదని సంచలన వ్యాఖ్యలు చేసిన గులాంనబీ ఆజాద్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత స్వాతంత్ర సంగ్రామాన్ని అన్ని భాషల్లో తప్పనిసరి సబ్జెక్ట్గా చేయకపోవడం పెద్ద తప్పిదమని అన్నారు. ఈ కారణంగా ఒకరి దేశ భక్తిని, వారు చేసిన సేవలనే ప్రశ్నించడానికి వీలు కల్పించినట్లైందన్నారు. ఉర్దూ పాత్రికేయానికి 200 ఏళ్లు నిండిన సందర్భంగా జరిగిన ఓ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ పాల్గొన్నారు. ఉర్దూ పత్రికలకు ఏ ప్రభుత్వం కూడా తగిన ప్రకటనలు ఇవ్వడం లేదని, ఈ విషయంలో మాత్రం తాను ఏ పార్టీని కూడా తప్పు పట్టనని పేర్కొన్నారు.
ఉర్దూ భాషను ప్రోత్సహించే విషయంలో గానీ, ఉర్దూ పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంలో ఏ పార్టీ తగిన శ్రద్ధ చూపదని, అన్ని పార్టీలూ ఆ తాను ముక్కలేనని, అన్ని పార్టీలూ దొందు దొందేనని విమర్శించారు. ఉర్దూ భాషను మాజీ ప్రధాని నెహ్రూ చాలా పొగిడేవారని, కానీ.. ఇప్పుడు ఉర్దూ ప్రభావం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటా ఆంగ్లం వచ్చిచేరిందని, ఉర్దూ ఆవశ్యకత తగ్గిపోయిందని పేర్కొన్నారు.
1947 విషయంలో చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. భారత స్వతంత్ర సంగ్రామాన్ని తప్పనిసరి సబ్జెక్టు చేయాల్సి వుండింది. అన్ని భాషల్లోనూ తప్పనిసరి చేయాల్సింది. కానీ చేయలేదు. ఆంగ్లం, గణితాన్ని మాత్రం తప్పనిసరి సబ్జెక్టు కిందికి చేర్చేశాం. ఒక వేళ ఇలా చేసి వుంటే.. ఎవ్వరి మూలాలను ఎవ్వరూ ప్రశ్నించి వుండేవారే కాదు అంటూ గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు.