న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ను అడ్డుకునే స్వదేశీ టీకా తయారవుతోంది. పూణెకు చెందిన జెన్నోవా కంపెనీ స్వదేశీ ఎం ఆర్ఎన్ఏ టీకాను రూపొందించింది. ఆ టీకాకు చెందిన మూడవ దశ ట్రయల్స్ కూడా ముగిశాయి. మెసెంజర్ ఆర్ఎన్ఏ లేదా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా.. వైరస్లోని జన్యువును తీసుకుని, దాని నుంచి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే టీకాను తయారు చేస్తారు. అతి స్వల్పమైన జన్యు పదార్థంతో.. కరోనా వైరస్లో ఉండే ప్రోటీన్ల తరహాలో మానవ కణాలను వృద్ధి చేసి, ఇమ్యూనిటీ వ్యవస్థను దృఢపరుస్తారు. ఈ ప్రక్రియలో ఎటువంటి సహజ వైరస్ను వినియోగించరు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు.. ఉత్తమ బూస్టర్ వ్యాక్సిన్లు అవుతాయని డాక్టర్ గగన్దీప్ కాంగ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
అమెరికాకు చెందిన హెచ్డీటీ బయోటెక్ కార్పొరేషన్తో కలిసి జెన్నోవా కంపెనీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ క్యాండిటేట్ను(HGCO19) అభివృద్ధి చేసింది. డెల్టా వేరియంట్ను ఎదుర్కొనేందుకు రూపొందిన రెండు డోసుల ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కు కూడా జెన్నోవా మూడవ దశ ట్రయల్స్ పూర్తి చేసింది. భారత డ్రగ్స్ రెగ్యూలటరీ సంస్థ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నది. స్వదేశీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను తయారు చేయడం గొప్ప విషయమని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పౌల్ తెలిపారు.