న్యూఢిల్లీ: గత ఏడాది గురుగ్రామ్లో 30 కోట్ల చోరీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ వికాశ్ లగర్పూరియాను అరెస్టు చేశారు. బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హర్యానా పోలీసులకు అతన్ని అప్పగించారు. దుబాయ్ నుంచి అతన్ని డిపోర్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై పలు మర్డర్, చోరీ, బెదిరింపుల కేసులు ఉన్నాయి. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా అతన్ని ప్రశ్నించనున్నారు.
గురుగ్రామ్లోని రెసిడెన్షియల్ సొసైటీ నుంచి 30 కోట్లు ఎత్తుకెళ్లిన కేసులో వికాశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆగస్టు 21, 2021 రోజున చోరీ కేసు బయటకువచ్చింది. ఆ సొసైటీలో ఉన్న రెండు అపార్ట్మెంట్లను మెయింటేనెన్స్ కోసం వాడుతున్నారు. అయితే అక్కడ చోరీ జరిగినట్లు ఓ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు.
తొలుత దీన్ని దొంగతనం కేసుగా భావించారు. అయితే విచారణ కొనసాగుతున్నా కొద్దీ.. కేసులో నిజాలు బయటకు వచ్చాయి. ఈ కేసును స్పెషల్ టాస్క్ ఫోర్స్కు అప్పగించారు. సుమారు 30 కోట్ల విలువైన బంగారం, నగదు, అమెరికా డాలర్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. గురుగ్రామ్ సెక్టార్ 84లో ఉన్న రెండు అపార్ట్మెంట్లలో సుమారు 40 కోట్ల మేర డెవలపర్ దాచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం తొలుత డాక్టర్ నావల్కు లీకైంది. ఆ తర్వాత ఆ సమాచారం గ్యాంగ్స్టర్ వికాశ్కు చేరింది. అప్పుడు చోరీ ప్లాన్ వేశారు. ఇప్పటి వరకు ఈ కేసుతో లింకు ఉన్న 17 మందిని అరెస్టు చేశారు.