కృష్ణజింకను చంపినందుకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను తనతోపాటు తమ బిష్ణోయ్ సమాజం ఎప్పటికీ క్షమించబోదని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరించారు. సల్మాన్ఖాన్ పబ్లిక్గా బిష్ణోయ్ సమాజానికి క్షమాపణలు చెప్పేదాకా తన నిర్ణయాన్ని మార్చుకోబోనని లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పేర్కొంది. కృష్ణజింకలను బిష్ణోయ్ కమ్యూనిటీ పవిత్రమైనదిగా భావిస్తుంది. కృష్ణజింకను చంపాడనే కారణంతో 2018లో సల్మాన్ఖాన్ను హత్యచేసేందుకు లారెన్స్ గ్యాంగ్ ప్రయత్నించింది.
ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలా హత్యకేసులో ఢిల్లీ పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ను విచారిస్తున్నారు. ఈ విచారణలో అతడు అనేక సంచలన విషయాలను వెల్లడిస్తున్నాడు. సల్మాన్ఖాన్, అతడి తండ్రి సలీం ఖాన్ తమ వర్గానికి బహిరంగంగా క్షమాపణ చెబితేనే తన మనసు మార్చుకుంటానని లారెన్స్ బిష్ణోయ్ చెప్పినట్లు పోలీసు అధికారి తెలిపారు. లేకుంటే వారికి సిద్ధు మూసేవాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. కాగా, కొద్దిరోజుల క్రితమే సల్మాన్ఖాన్ తరఫు న్యాయవాది హస్తిమల్, అతడి కుటుంబ సభ్యులకు ఓ మరణ బెదిరింపు లేఖ వచ్చింది. ‘మీ అందరికీ సింగర్ సిద్దు మూసేవాలా గతే పడుతుంద’ని ఆ లేఖలో ఉన్నట్లు హస్తిమల్ చెప్పారు. ఈ లేఖ వచ్చిన కొన్నిరోజుల వ్యవధిలోనే లారెన్స్ బిష్ణోయ్ ఈ సంచలన విషయాలు వెల్లడించండం కలకలం రేపుతోంది.