న్యూఢిల్లీ: పలు నేరాలతో సంబంధం ఉన్న గ్యాంగ్స్టర్తో లేడీ గ్యాంగ్స్టర్ పెళ్లి జరుగనున్నది. (Gangster Duo’s Marriage) వీరిద్దరి వివాహానికి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఈ పెళ్లి పోలీసుల్లో హాట్ టాపిక్గా మారింది. రాజస్థాన్కు చెందిన లేడీ గ్యాంగ్స్టర్ అనురాధ చౌదరి అలియాస్ ‘మేడమ్ మింజ్’కు హర్యానాకు చెందిన గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జాతేడితో మార్చి 12న వివాహం జరుగనున్నది. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట హర్యానాలోని సోనిపట్లో పెళ్లి చేసుకోనున్నది. అనురాధ ఇప్పటికే బెయిల్పై విడుదలైంది. అయితే పెళ్లి కోసం సందీప్కు కేవలం ఆరు గంటల పెరోల్ను కోర్టు మంజూరు చేసింది. గ్యాంగ్స్టర్ల జంట వివాహ ఆహ్వాన పత్రిక కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఎంబీఏ చదివిన అనురాధ ఆ తర్వాత బ్యాంక్లో ఉద్యోగం చేసింది. 2007లో దీపక్ మింజ్తో ఆమె వివాహం జరిగింది. 2013లో భర్త నుంచి విడిపోయింది. మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న అనురాధ 2017లో రాజస్థాన్లోని చురులో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ ఆనంద్పాల్ సింగ్తో చేతులు కలిపింది. రాజస్థాన్, ఢిల్లీలో మనీలాండరింగ్, కిడ్నాప్, బెదిరింపులు, ఆయుధాల చట్టానికి సంబంధించి ఆరుపైగా కేసులు నమోదైన ఆమెపై పది వేల రివార్డ్ కూడా ఉంది.
మరోవైపు హర్యానా సోనిపట్లోని జాతేడి గ్రామానికి చెందిన సందీప్ ఐటీఐ చదివాడు. చెడు సహవాసం వల్ల నేరాల బాటపట్టాడు. 2004లో తన సహచరులతో కలిసి ఢిల్లీకి వచ్చిన అతడు ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో తొలి కేసు నమోదైంది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు సన్నిహితుడైన సందీప్పై ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో 12కు పైగా దోపిడీలు, హత్యలు, హత్యాయత్నం, ఆయుధాల చట్టం వంటి కేసులున్నాయి. ఏడు లక్షల రివార్డ్ ఉన్న సందీప్, అనురాధతో కలిసి ఒక దాబా వద్ద ఉండగా 2021 జూలై 30న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు.
కాగా, అనురాధ, సందీప్ ప్రేమ కథ 2020లో ప్రారంభమైంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తొలిసారి వీరిద్దరు కలుసుకున్నారు. ఆనంద్పాల్ సోదరుడు విక్కీ సింగ్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది. నేర కేసుల్లో పరారీలో ఉన్న ఈ జంట ఒక గుడిలో పెళ్లి చేసుకుంది. ఇండోర్లోని అద్దె ఇంట్లో కొన్ని నెలలు కలిసి జీవించారు.
2021 మార్చి నుంచి కొన్ని నెలలపాటు బీహార్లో వీరిద్దరూ నివసించారు. ఆ ఏడాది జూన్లో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని షిరిడీతోపాటు ఉత్తరప్రదేశ్లోని మధురను సందర్శించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ సందర్శన తర్వాత 2021 జూలై 30న ఢిల్లీ పోలీసులు ఈ జంటను అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలైన అనురాధ తరచుగా జైల్లో ఉన్న సందీప్ను చట్టబద్ధంగా కలుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సోనిపట్లోని సందీప్ తల్లిదండ్రుల వద్ద ఉంటున్న ఆమె వారి బాగోగులు చూసుకుంటున్నట్లు వెల్లడించారు.