న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఢిల్లీలోని రోహిణి కోర్టు. శుక్రవారం మధ్యాహ్న వేళ. కోర్టు ఆవరణ అంతా లాయర్లతో, కక్షిదారులతో సందడిగా ఉంది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ జితేంద్ర గోగిని పోలీసులు ఓ కేసు విచారణ నిమిత్తం అక్కడికి తీసుకువచ్చారు. కోర్టు భవనంలో ప్రవేశించారు. అంతలోనే తుపాకీ పేలిన శబ్దం. ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకటి.. రెండు..మూడు.. ఇలా బుల్లెట్లు పేలుతూనే ఉన్నాయి. లాయర్ కోట్లు తొడుక్కున్న ఇద్దరు జితేంద్ర గోగి లక్ష్యంగా తుపాకీ గుండ్ల వర్షం కురిపిస్తున్నారు. వెంటనే పోలీసులు తేరుకొన్నారు. వారిపైకి కాల్పులు జరిపారు. ఇద్దరూ చనిపోయారు. అప్పటికే గోగి కూడా హతమయ్యాడు. పట్టపగలే దేశ రాజధానిలో ఓ కోర్టు హాలు గ్యాంగ్స్టర్ల కాల్పులకు, ప్రతీకార దాడికి వేదిక కావడం అందరినీ నివ్వెరపర్చింది. కాల్పులు జరిపిన ఇద్దరూ గోగి ప్రత్యర్థి వర్గానికి చెందిన వారని భావిస్తున్నారు. కాల్పుల ఘటనతో కోర్టు ఆవరణలో భయం అలుముకొన్నది. గ్యాంగ్స్టర్లకు తప్ప ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. గోగి ఓ కేసులో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. రోహిణి కోర్టులో గతంలో కూడా కాల్పుల ఘటనలు జరిగాయి. గోగి తలపై గతంలో పోలీసులు రూ.6.5 లక్షల రివార్డు ప్రకటించారు.