ఇంపాల్: మణిపూర్(Manipur)లో తాజాగా మళ్లీ హింస(Violence) చెలరేగింది. ఆ అల్లర్లలో 9 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. ఇంపాల్ ఈస్ట్, కాంగ్పోప్కి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అగిజంగ్ గ్రామంలో కాల్పుల ఘటన జరిగింది. మంగళవారం రాత్రి 10 నుంచి 10.30 నిమిషాల మధ్య ఫైరింగ్ జరిగింది. ఓ బృందం ఆయుధాలతో దాడికి రాగా.. భద్రతా దళాలు ఆ గ్యాంగ్ను అడ్డుకున్నాయి. ఆ సమయంలో ఫైరింగ్ జరిగింది. గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించారు.
ఫైరింగ్ జరిగిన ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ సెక్యూర్టీ ఇంచార్జిగా ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఇంపాల్ పోలీసు అధికారి శివకాంత్ సింగ్ తెలిపారు. గత కొన్నాళ్లుగా మణిపూర్లో రెండు తెగల మధ్య ఘర్షణ జరుగుతున్న విషయం తెలిసిందే. గిరిజన తెగ కుక్కిలు, మైటీల మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటి వరకు 115 మంది మరణించారు. మరో 40 వేల మంది వరకు ఆశ్రయాన్ని కోల్పోయారు.
మైటీ తెగలకు ఎస్టీ హోదా ఇవ్వడంతో ఆ రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లింది. రెండు తెగల మధ్య శాంతి కుదిర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. పీస్ కమిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు రెండు తెగలు నిరాకరించాయి.