ముంబై: పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన దృష్ట్యా దుబాయ్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు అండగా ఉండేందుకు సినీనటుడు సోనూ సూద్ ముందుకు వచ్చారు. దుబాయ్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఉచిత వసతి సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పోస్టు చేసిన ఓ వీడియోలో సోనూ సూద్ తెలియచేశారు. విమాన ప్రయాణంలో అవాంఛిత అంతరాయాల మధ్య దుబాయ్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు ఉచిత వసతిని పొందవచ్చని ఆయన చెప్పారు. యుద్ధం వల్ల చాలా మంది దుబాయ్లో చిక్కుకుపోయారు.
అలాంటివారిలో మీరు ఉంటే మేము అందచేసే ఉచిత వసతిని పొందవచ్చు. జాతీయత లేదు, షరతులు లేవు, కేవలం మానవత్వం మాత్రమే. సహాయం పొందాలనుకొనేవారు ఇన్స్టాగ్రామ్పై డీఎం(డైరెక్ట్ మెసేజ్) చేయవచ్చు అని వీడియోలో సోనూ సూద్ పేర్కొన్నారు. గతంలో కొవిడ్ కాలంలో కూడా సోనూసూద్ మానవతా సహాయం అందచేసి ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడు దుబాయ్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు అండగా నిలబడ్డ ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.