బెంగళూరు: కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, పార్టీకి ఎంతో నమ్మకస్తుడైన బీఎస్ యెడియూరప్ప సీఎం పదవిని నాలుగుసార్లు చేపట్టారు. అయితే ఏ ఒక్కసారి కూడా పూర్తి కాలం సీఎం పదవిలో ఆయన కొనసాగలేదు. యెడియూరప్ప సీఎం పదవికి నాలుగుసార్లు రాజీనామా చేయడానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే..
2007లో.. ఎనిమిది రోజులు సీఎంగా యెడ్డీ
2006 జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి జేడీ(ఎస్) తన మద్దతు ఉపసంహరించింది. ఆ ప్రభుత్వం కూలిపోవడంతో జేడీ(ఎస్), బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి సీఎంగా, యెడియూరప్ప డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒప్పందం ప్రకారం 20 నెలల తర్వాత కుమారస్వామి సీఎం పదవిని యెడ్డీకి అప్పగించాల్సి ఉంది. 2007 అక్టోబర్లో సీఎం పదవి నుంచి దిగేందుకు కుమారస్వామి నిరాకరించారు. దీంతో యెడియూరప్పతోపాటు బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అక్టోబర్ 5న కుమారస్వామి ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం జేడీ(ఎస్), బీజేపీ మళ్లీ మంతనాలు జరిపాయి. బీజేపీకి పాలన అప్పగించేందుకు జేడీఎస్ అంగీకరించింది. దీంతో నవంబర్ 7న రాష్ట్రపతి పాలన ఎత్తివేయగా నవంబర్ 12న యెడియూరప్ప తొలిసారి సీఎంగా ప్రమాణం చేశారు. దీంతో బీజేపీ తొలిసారి దక్షిణాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే మంత్రి శాఖల కేటాయింపులో వివాదం నేపథ్యంలో జేడీ(ఎస్) తన మద్దతు వెనక్కితీసుకున్నది. విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న యెడియూరప్పకు వ్యతిరేకంగా ఓటు వేయాలని జేడీఎస్ విప్ జారీ చేసింది. దీంతో 2007 నవంబర్ 19న అసెంబ్లీలో చర్చ అనంతరం విశ్వాస తీర్మానంపై ఓటింగ్కు ముందు యెడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు.
2008 నుంచి సీఎం పదవిలో మూడున్నర ఏండ్లు
2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో 2008 మే 30న యెడియూరప్ప రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అక్రమ మైనింగ్ వ్యవహారంలో యెడియూరప్ప పాత్రపై కర్ణాటక లోకాయుక్తా దర్యాప్తు జరిపి 2011లో నివేదిక సమర్పించింది. దీంతో బీజేపీ అధిష్ఠానం నుంచి ఆయనపై ఒత్తిడి రావడంతో మూడున్న ఏండ్ల పాలన తర్వాత 2011 జూలై 31న సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2012 నవంబర్ 30న శాసన సభ్యత్వంతోపాటు బీజేపీ ప్రాథమిక సభత్వానికి రాజీనామా చేశారు. అనంతరం కర్ణాటక జనతా పక్ష పార్టీని ఏర్పాటు చేశారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గంమైన శివమొగ్గ జిల్లాలోని షికారిపుర నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2013 నవంబర్లో తిరిగి బీజేపీలో చేరిన యెడియూరప్ప 2014 జనవరి 2న తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు.
2018లో సీఎంగా రెండున్నర రోజులు
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 112 సీట్లు రాలేదు. అయితే 104 స్థానాల్లో గెలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దీంతో 2018 మే 17న యెడియూరప్ప సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ 15 రోజులు గడువు ఇచ్చారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీంతో ఒక్క రోజులోనే మెజార్టీని నిరూపించుకోవాలని యెడియూరప్పను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2018 మే 19న అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ముందు భావోద్వేగంతో మాట్లాడిన ఆయన తగిన మెజార్టీ లేకపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. కేవలం రెండున్నర రోజలు సీఎంగా ఉన్న వ్యక్తిగా యెడ్డీ రికార్డుకెక్కారు.
2019 నుంచి సీఎంగా రెండేండ్లు
2018లో యెడియూరప్ప రాజీనామా అనంతరం 80 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్, 36 స్థానాల్లో గెలిచిన జేడీఎస్ కలిసి కుమారస్వామి సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఏడాది తర్వాత కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను బీజేపీ ఆకట్టుకుంది. దీంతో వారు శాసనసభ్యత్వానికి రాజీనామాలు సమర్పించి బీజేపీలో చేరారు. దీంతో 2019 జూలై 23న జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో 2019 జూలై 26న యెడియూరప్ప నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఏడాది తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తిని ఆయన ఎదుర్కొన్నారు. కరోనా నియంత్రణలో వైఫల్యంతోపాటు యెడ్డీ అవినీతిపై బీజేపీ ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటన చేశారు. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో 2021 జూన్ నుంచి సీఎం మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో రెండేండ్లుగా సీఎంగా ఉన్న యెడియూరప్ప, గత నెల రోజులుగా సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ వచ్చారు. ఇటీవల ప్రధాని మోదీతో భేటీ అనంతరం చివరకు సోమవారం (2021 జూలై 26న) సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు.