పుదుచ్చేరి : పుదుచ్చేరి శాసససభ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఏఐఏడీఎంకే కూటమిగా పోటీ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి నిర్మల్ కుమార్ సురాణా తెలిపారు. ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ, ఏఐఏడీఎంకే కలిసి 14 స్థానాల్లో పోటీ చేస్తాయని ఆయన వెల్లడించారు. ఎన్డీఏ కూటమికి మాజీ ముఖ్యమంత్రి, ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగస్వామి నాయకత్వం వహిస్తారని.. ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఆయనేనని నిర్మల్ కుమార్ సురాణా స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే కూటమితో ఎన్డీఏ కూటమి తలపడనుంది. పుదుచ్చేరిలో మొత్తం 30 శాసనసభ స్థానాలున్నాయి. కేంద్రం మరో ముగ్గురు శాసనసభ్యులను నామినేటెడ్ చేసేందుకు అవకాశం ఉంది. గత నెల నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు మరో డీఎంకే ఎమ్మెల్యే సీఎం నారాయణస్వామితో విభేదిస్తూ తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. పుదుచ్చేరి శాసససభకు వచ్చే నెల 6న ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఓపినియన్ పోల్స్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి.