Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్, మండి జిల్లా, చండీగఢ్-మనాలి నేషనల్ హైవేపై, హనోగి టన్నెల్ లోపల గురువారం ఉదయం జరిగింది.
టన్నెల్ లోపల ఉదయం 7.45 గంటలకు రెండు ట్రక్కులు వేగంగా వెళ్తూ, ఎదురెదురుగా ఢీకొన్నాయి. వేగంగా ఢీకొనడంతో వాహనాల ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ట్రక్కుల్లోని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. బాధితుల్ని బయటకు తీసి రక్షించే చర్యలు చేపట్టాయి. గాయపడ్డవారిని చికిత్స కోసం స్తానిక ఆస్పత్రులకు తరలించారు.
అయితే, తీవ్రగాయాల కారణంగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో నెర్చౌక్ మెడికల్ కాలేజీకి తరలించారు. టన్నెల్ లోపల ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్కు కూడా అంతరాయ ఏర్పడింది. అయితే, పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని మండి జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై విశ్లేషిస్తున్నామన్నారు.