లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కొన్ని రోజుల గడువు మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల 10న తొలి విడత పోలింగ్ జరుగనుంది. అయినా ఇప్పటికీ ఒకపార్టీ నుంచి ఇంకో పార్టీలోకి నేతల జంపింగ్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సమాజ్వాది పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ప్రమోద్ గుప్తా మాట్లాడుతూ.. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ను అఖిలేష్ యాదవ్ బంధీని చేశాడని, పార్టీలో ఆయన పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని ఆరోపించారు. ప్రస్తుతం సమాజ్వాది పార్టీలో నేరగాళ్లు, మోసగాళ్లు నిండిపోయారని విమర్శించారు. అందుకే తాను ఆ పార్టీని వీడి బీజేపీలో చేరానని చెప్పారు. కాగా, ప్రమోద్ గుప్తాతోపాటు కాంగ్రెస్ మాజీ నాయకురాలు ప్రియాంకా మౌర్య కూడా ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.