న్యూఢిల్లీ: భారతదేశ మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) లేదా జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు హెచ్డీ దేవేగౌడకు కరోనా పాజిటివ్ వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఇవాళ ఉదయం పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు తెలిసింది. అయితే, అతనిలో కొవిడ్ లక్షణాలేవి లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని దేవేగౌడ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
అదేవిధంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప కూడా దేవేగౌడకు కరోనా వచ్చిన విషయాన్ని ధృవీకరించారు. దేవేగౌడ త్వరగా కోలుకోవాలి ఆకాంక్షించారు. ఆ మేరకు భారత మాజీ ప్రధాని, సీనియర్ నాయకుడు హెచ్డీ దేవేగౌడ త్వరగా కరోనా మహమ్మారి బారినుంచి కోలుకోవాలని ఆశిస్తున్నా అంటూ యెడియూరప్ప కన్నడంలో ట్వీట్ చేశారు.
కాగా, దేవేగౌడ భారతదేశానికి 12వ ప్రధానిగా పనిచేశారు. ఆయన 1996 జూన్ నుంచి 1997 ఏప్రిల్ వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు ఆయన కర్ణాటక రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 1994 నుంచి 1996 వరకు కర్ణాటక సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన భారత పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.