భోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్య (Rohit Arya) బీజేపీలో చేరారు. పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శనివారం భోపాల్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాఘవేంద్ర శర్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 2013 సెప్టెంబరు 12న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రోహిత్ ఆర్య నియమితులయ్యారు. 2015 మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన ఆయన అనేక కేసుల్లో తీర్పులు ఇచ్చారు.
కాగా, జస్టిస్ రోహిత్ ఆర్య వెల్లడించిన కొన్ని తీర్పులపై విమర్శలు వచ్చాయి. 2021లో ఇండోర్లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, కోవిడ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ హాస్యనటులు మునావర్ ఫరూకీ, నలిన్ యాదవ్లకు బెయిల్ నిరాకరించారు. అయితే హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఫరూఖీకి బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు 2020లో మరో కేసులో మహిళ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తికి జస్టిస్ రోహిత్ ఆర్య బెయిల్ మంజూరు చేశారు. రక్షా బంధన్ రోజున బాధిత మహిళకు రాఖీ కట్టాలని, ఆమెకు రక్షణ కల్పించేలా నిందితుడు హామీ ఇవ్వాలని షరతు విధించారు. అయితే ఈ తీర్పు వివాదస్పదం కావడంతో సుప్రీంకోర్టు రద్దు చేసింది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులలో నిందితుల బెయిల్ పిటిషన్ల పరిశీలనపై దిగువ కోర్టులకు పలు సూచనలు చేసింది.