న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరుగా రాజకీయాల బాటపడుతున్నారు. అలనాడు మన్సూర్ అలీఖాన్ పటౌడీ మొదలు ఇటివల మనోజ్ తివారీ వరకు ఇప్పటికే పదుల సంఖ్యలో క్రికెటర్లు రాజకీయాల్లో చేరారు. గౌతం గంబీర్, నవజ్యోత్సింగ్ సిద్ధూ, మహ్మద్ ఖైఫ్, మహ్మద్ అజారుద్దీన్, కీర్తి ఆజాద్, చేతన్ చౌహాన్, వినోద్ కాంబ్లీ సహా పలువురు క్రికెటర్లు ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు.
తాజాగా ఈ జాబితాలో మరో క్రికెటర్ చేరాడు. భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ దినేశ్ మోంగియా ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మధ్యాహ్నం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జి గజేంద్ర సింగ్ షెకావత్, ఇతర కీలక నేతల సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మోంగియా మట్లాడుతూ.. పంజాబ్ ప్రజలకు సేవ చేయడం కోసం బీజేపీలో చేరానని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ మినహా మరే పార్టీ దేశాన్ని అభివృద్ధి చేయలేదని దినేశ్ మోంగియా పేర్కొన్నారు.