అయోధ్య, సెప్టెంబర్ 2 : అయోధ్య రామ మందిరం తొలి చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్(సీఈవో)గా మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బుధవారం ఆమోదించింది. దేవరియాకు చెందిన మిశ్రా ఆపరేషన్ సిందూర్ సమయంలో వెస్టర్న్ ఎయిర్ కమాండ్ అధిపతిగా ఉన్నారు. రామ మందిరంలో విరాళాల చోరీ జరిగినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన మూడవ సమావేశాన్ని బుధవారం నిర్వహించింది. ఈ సందర్భంగా ముగ్గురు కొత్త ట్రస్టీలను ట్రస్ట్ ప్రకటించింది. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు.
ఢిల్లీకి చెందిన మహేష్ భాగ్చంద్కా, అయోధ్య న్యాయవాది మదన్ మోహన్ పాండే, ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న షికోహాబాద్కు చెందిన నిర్మలా యాదవ్ ట్రస్టీలుగా నియమితులయ్యారు. విశ్వ హిందూ పరిషద్(వీహెచ్పీ) మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్కు బంధువైన మహేష్ భాగ్చంద్కా 2020లో రామ మందిర భూమిపూజ సందర్భంగా నిర్వహించిన ధార్మిక కార్యక్రమంలో ఆయన ప్రధాన యజమానిగా వ్యవహరించారు. 2024 జనవరి 22న రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా ఆయన యజమానిగా వ్యవహరించారు. దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు ఈ కొత్త బాధ్యతను స్వీకరించేలా ప్రేరణ ఇచ్చిందని జితేంద్ర మిశ్రా(రిటైర్డ్) అన్నారు.