గువాహటి: అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం.. వరదల కారణంగా ఇప్పటి వరకు 17 జిల్లాల్లో సుమారు 1.90 లక్షల మంది ప్రభావితమయ్యారు. తాజాగా ఇవాళ కూడా వరదల వల్ల శివసాగర్ జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో ఇప్పటి వరకు వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 15 కు పెరిగింది.
రాష్ట్రంలోని 17 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయని, ఈ వరదల కారణంగా 1,90,675 మంది ప్రభావితమయ్యారని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. లఖింపూర్ జిల్లాలో ఎక్కువగా 47,338 మందిపై వరదల ప్రభావం పడింది. ఆ తర్వాత ధేమాజీలో 40,997 మంది ప్రభావితమయ్యారు. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలవల్ల నదుల్లో నీటిమట్టం పెరిగిందని, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వివిధ నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని ASDMA తన ప్రకటనలో పేర్కొంది.
ఎగువ నుంచి వరద తాకిడి ఎక్కువ కావడంతో గువాహటి వద్ద బ్రహ్మపుత్ర నదిలో, జోర్హాట్లోని నిమ్తి ఘాట్లో ఫెర్రీ సర్వీసులను నిలిపివేశారు. వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో 8,086.40 హెక్టార్ల పంట భూములు వరద నీటిలో మునిగిపోయాయి. అంతేగాక పలు చోట్ల పశువులు, మేకలు, గొర్రెలు తదితర మూగ జీవాలు కొట్టుకుపోయాయని ASDMA తెలిపింది.