న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశ రాజధాని ఢిల్లీలో ఐదు అంతస్తుల పీజీ హాస్టల్ భవనం కుప్పకూలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, పలువురు శిథిలాల కింద చిక్కుకొన్నారని తెలిసింది. ఢిల్లీ వర్సిటీకి సమీపంలోని 50 ఏండ్లనాటి ఈ భవనంలో గురుగ్రామ్కు చెందిన ఓ వ్యక్తి పీజీ హాస్టల్ నడుపుతున్నాడని, భవనం కుప్పకూలిన సమయంలో దాని లోపల దాదాపు 50 మంది ఉన్నారని, ఇందులో చాలామంది విద్యార్థులేనని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో..ఘటన తీవ్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
శిథిలాల కింద చిక్కుకున్న 8 మందిని రెస్క్యూ బృందాలు బయటకు తీసుకొచ్చాయి. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేఖా గుప్తా, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని అన్నారు. కొంతమంది విద్యార్థులు లోపలి నుంచి ఫోన్కాల్స్ చేస్తున్నారని, వారంతా లోపల చిక్కుకున్నారని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనిల్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
భవనం కూలడానికి అవినీతే కారణమని ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ‘ఆర్కే పురం సత్య నికేతన్లోని భవనం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హఠాత్తుగా కుప్పకూలింది. ఇది 40-50 ఏండ్ల క్రితం నాటి భవనం. బేస్మెంట్లో మరమ్మత్తులు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది’ అని పోలీసులు తెలిపారు.