ముంబై: ఒక కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు 20 రోజుల వ్యవధిలో మరణించారు. (Five deaths in family) వారంతా ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ముగ్గురు కూడా ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆ కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
సెప్టెంబరు 20న శంకర్ కుంభారే, ఆయన భార్య విజయకు ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయి. వారి ఆరోగ్యం వేగంగా క్షీణించింది. శరీరంలో నొప్పితోపాటు గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తొలుత అహేరిలోని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత చంద్రాపూర్లోని హాస్పిటల్కు, చివరకు నాగ్పూర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సెప్టెంబర్ 26న శంకర్ మరణించగా ఒక రోజు తర్వాత ఆయన భార్య విజయ చనిపోయింది.
కాగా, ఆ కుటుంబం ఇంకా దుఃఖంలో ఉండగానే ఆ దంపతుల కుమార్తెలు కోమల్, ఆనందతోపాటు వారి కుమారుడు రోషన్ ఆసుపత్రిపాలయ్యారు. వారి ఆరోగ్యం క్షీణించడంతో అక్టోబర్ 8న కోమల్, 14న ఆనంద, 15న రోషన్ మరణించారు. కుటుంబ సభ్యుల మరణవార్త విన్న శంకర్ పెద్ద కుమారుడు సాగర్ హుటాహుటిన ఢిల్లీ నుంచి చంద్రాపూర్ చేరుకున్నాడు. అతడు కూడా అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన కారు డ్రైవర్ రాకేష్ ఆరోగ్యం కూడా విషమించడంతో అతడ్ని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ కుటుంబానికి సహాయంగా చంద్రాపూర్, నాగ్పూర్ను సందర్శించిన బంధువు కూడా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. అయితే ఈ ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు మరణించిన ఐదుగురు కుటుంబ సభ్యులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురికి కాళ్లు పట్టేయడం, నడుం భాగంలో విపరీతమైన నొప్పి, తలనొప్పి, పెదవులు నల్లబడడం, నాలుక బరువెక్కడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో వారిపై విష ప్రయోగం జరిగి ఉంటుందని డాక్టర్లు అనుమానించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపారు. మహారాష్ట్రతోపాటు తెలంగాణాలో విచారణ చేశారు. చివరకు ఆ కుటుంబానికి చెందిన సంఘమిత్ర, రోసా అనే ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.
కాగా, శంకర్ కుమారుడైన రోషన్తో సంఘమిత్రకు అయిష్టంగా పెళ్లి జరిగింది. కొన్ని నెలల కిందట ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే భర్త, అత్తమామలు వేధిస్తుండటంతో వారిని అంతం చేయాలని ఆమె భావించింది. మరోవైపు సమీపంలోని ఇంట్లో ఉంటుందన్న బంధువైన రోసా భర్త కుటుంబం, శంకర్ కుటుంబం మధ్య ఆస్తి తాగాదాలున్నాయి.
ఈ నేపథ్యంలో శంకర్ కుటుంబాన్ని అంతం చేసేందుకు సంఘమిత్ర, రోసా చేతులు కలిపారు. తెలంగాణకు వెళ్లిన రోసా, ఆహారం లేదా నీటిలో కలిపినప్పటికీ గుర్తించని విషపూరిత పదార్థాన్ని తెచ్చింది. దీంతో సంఘమిత్ర, రోసా కలిసి విష ప్రయోగానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో శంకర్, ఆయన భర్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు మరణించారని చెప్పారు. అలాగే ఆ విష పదార్థం కలిపిన బాటిల్లోని నీటిని తాగిన మరో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారని వెల్లడించారు.