న్యూఢిల్లీ, నవంబర్ 29: వేతన సవరణ, వారంలో ఐదు రోజుల పనిదినాల్ని అమలుజేయాలన్న బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ త్వరలో నెరవేరబోతున్నది. ఎంతోకాలంగా నలుగుతున్న ఈ అంశాలపై సానుకూల ప్రకటన రాబోతున్నదని కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. బ్యాంకు ఉద్యోగుల వేతనాల్లో పెంపుదల 15 -20% వరకు ఉంటుందని, అంతేగాక వారంలో ఐదు రోజుల పనిదినాలు.. డిసెంబర్ రెండోవారం నుంచి అమల్లోకి రాబోతున్నదని సదరు వర్గాలు తెలిపాయి.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కూడా ఇది వర్తింపజేస్తారని వెల్లడించాయి. బ్యాంక్ యూనియన్లు, అసోసియేషన్లకు, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)కు మధ్య జరుగుతున్న 12వ ద్వైపాక్షిక ఒప్పంద చర్చలు కొలిక్కివచ్చినట్టు సమాచారం. చర్చలు తుది దశలో ఉన్నాయని, బ్యాంక్ ఉద్యోగుల కీలక డిమాండ్లు నెరవేరే అవకాశముందని ఈ అంశంతో సంబంధమున్న అధికారిక వర్గాలు మీడియాకు తెలిపాయి.
చర్చలు సఫలీకృతమయ్యాక, ఇరు వర్గాలకు చెందిన ప్రతినిధులు మెమోరాండంపై సంతకం చేయనున్నాయి. దీనిపై తుది ఆమోదం కోసం మెమోరాండంను కేంద్ర ఆర్థికశాఖకు పంపుతారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ప్రస్తుతం అమలుజేస్తున్న వేతన ఒప్పందం గడువు 2022 నవంబర్ 1తో ముగిసింది. దీంతో నూతన వేతన ఒప్పందంపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు, ఐబీఏకు మధ్య చర్చలు మొదలయ్యాయి. పనిదినాలపై కేంద్రం లేదా ఐబీఏ త్వరలో ప్రకటన చేయనున్నట్టు సమాచారం.