జైపూర్: రాజస్థాన్లోని సికార్ జిల్లా కేంద్రంలో శనివారం పట్టపగలే గ్యాంగ్స్టర్ రాజు థెట్ను కాల్చిచంపిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. ఒక్కరోజులేనే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులను ఆయన అభినందించారు.
శనివారం జరిగిన గ్యాంగ్ వార్లో రాజు థెట్ హతమవగానే పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు తారసపడిన నిందితులు లొంగిపొమ్మని చెప్పినా వినకుండా కాల్పులకు దిగారు. దాంతో పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు నిందితులు గాయపడటంతో మిగతా ముగ్గురు కూడా లొంగిపోయారు.
అరెస్టయిన నిందితుల్లో సికార్ వాసులైన మనీశ్ జాట్, విక్రమ్ గుర్జర్, హర్యానాకు చెందిన సతీశ్కుమార్, జతిన్ మేఘ్వాల్, నవీన్ మేఘ్వాల్ ఉన్నారు. నిన్ని షూటౌట్లో మరణించిన రాజు థెట్కు, మరో గ్యాంగ్స్టర్ ఆనంద్పాల్ సింగ్కు మధ్య వైరం ఉండేది. ఈ క్రమంలో 2017లో పోలీస్ ఎన్కౌంటర్లో ఆనంద్ పాల్ సింగ్ హతమయ్యాడు.
అప్పట్లో అరెస్టయిన రాజు థెట్.. ఆ తర్వాత బెయిల్పై బయటికి వచ్చి లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆనంద్పాల్ సింగ్ గ్యాంగ్ సభ్యులు రాజు థెట్ హత్యకు పథక రచన చేశారు. అనుకున్నట్లుగానే శనివారం అతని ఇంటి గేటు ముందే రాజు థెట్ను కాల్చిచంపారు. కాల్పుల్లో స్థానిక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్న తన బిడ్డను చూసేందుకు వచ్చిన కద్వసారా అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.
రాజు థెట్ మనిషి అన్న అనుమానంతో అతడిపై కాల్పులు జరిపినట్లు నిందితులు తెలిపారు. అందుకు తమను క్షమించాలని కద్వసారా కుటుంబసభ్యులను కోరారు. వీలును బట్టి కద్వసారా కుటుంబానికి తమకు చేతనైనా సాయం చేస్తామని నిందితుల తరఫున ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.